ఎండ తీవ్రతపై ఆరోగ్యశాఖ హెచ్చరికలు.. తస్మాత్ జాగ్రత్త

by Naga Rani Yarlagadda |

ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ పలు కీలక సూచనలు చేసింది.

ఎండ తీవ్రతపై ఆరోగ్యశాఖ హెచ్చరికలు.. తస్మాత్ జాగ్రత్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ డా. బి. రవీందర్ నాయక్ సూచించారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగాలని, అవసరమైతే ఓఆర్‌ఎస్ ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు నీటి బాటిల్ వెంట తీసుకెళ్లడం మంచిదన్నారు. పుచ్చకాయ, దోసకాయ, ద్రాక్ష వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. సూర్యరశ్మి నేరుగా పడకుండా టోపీ, గొడుగు లేదా గుడ్డతో తలను కప్పుకోవాలని, తేలికపాటి లేత రంగు పత్తి బట్టలు ధరించాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండాలని, కఠినమైన శారీరక శ్రమను నివారించాలని సూచించారు. వాంతులు, తలనొప్పి, తల తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. ఎండ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ద్రావణాలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

Next Story