ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

by Disha Web Desk 2 |
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో 100 కొత్త బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులను శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పారు. రూ.280 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. గత ప్రభుత్వం నియంత మాదిరి పాలించి ఆర్టీసీ సంఘాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రెండు నెలల్లోనే 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని తెలిపారు.

నిజమైన అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు.. ఆర్టీసీ కార్మికులు అనేక కలలు కన్నారని అన్నారు. రాష్ట్రం వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినట్లు గుర్తుచేశారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెను పట్టించుకోలేదని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా కనికరం లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed