- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారామసాగర్పై ఫోకస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామసాగర్ ఎత్తిపోతల పథకాన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చి పర్యావరణ అనుమతులు త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామసాగర్ ఎత్తిపోతల పథకాన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చి పర్యావరణ అనుమతులు త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జలసౌధలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న అన్ని అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేయాలన్నారు. భూసేకరణ, పునరావాసం, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని ప్రతిపాదనలను వెంటనే కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే కేంద్ర జల సంఘం నుంచి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతి లభించినట్లు అధికారులు వివరించారు. జాప్యాల వల్ల రైతులకు సాగునీటి ప్రయోజనాలు అందకుండా ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతుల సాధనకు సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని ఆదేశించారు.
కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను సమీక్షించిన మంత్రి, సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వాదించేందుకు అదనపు అడ్వకేట్ జనరల్ను న్యూఢిల్లీకి నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్కు మళ్లింపు ప్రాధాన్య అంశమని.. రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల రంగం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సాధ్యమైన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ వ్యవస్థ ద్వారా పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మళ్లించే అంశానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి ఎన్ఎస్పీ ఎడమ కాలువ వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఆయకట్టుకు, ముఖ్యంగా చివరి భాగాల్లోని, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు స్థిరమైన సాగునీటి సరఫరా అందించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
నీటిపారుదల, రెవెన్యూ, జిల్లా యంత్రాంగాల సమన్వయంతో పెండింగ్ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. కొన్ని ప్రాజెక్టు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తయిందని, మరికొన్ని ప్రాంతాల్లో అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. జూలై నెలాఖరు నాటికి అవసరమైన అన్ని అటవీ అనుమతులు పొందాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణ సమస్యలను కారణంగా చూపుతూ కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే.. మున్నేరు–పాలేరు లింక్ కాలువ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
సుమారు 9 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రావిటీ కాలువ కోసం నాలుగు గ్రామాల్లో 317 ఎకరాల భూమి అవసరమని అధికారులు వివరించారు. రెండు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మిగతా రెండు గ్రామాల్లో కొనసాగుతున్నదని తెలిపారు. భూసేకరణకు సుమారు రూ.30 కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ అంశాన్ని రెవెన్యూ శాఖతో యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. అలాగే.. ఎల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మెట్ట ప్రాంత గిరిజన ప్రాంతాలకు సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–1 నుంచి నీటిని అందించే ప్రతిపాదనకు మంత్రి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
ఈ ప్రతిపాదనను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశంలో ప్రతిపాదించారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ల కారణంగా భద్రాచలం డివిజన్లో ఏర్పడుతున్న ముంపు సమస్యలపై ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని త్వరలోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పక్షం రోజుల్లో విస్తృత పర్యటన చేపడతానని ప్రకటించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి కోసం అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతో పాటుజిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.






