నాటుసారా, డ్రగ్స్‌పై ఎక్సైజ్ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాటుసారాను సమూలంగా నాశనం చేసేందుకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.

నాటుసారా, డ్రగ్స్‌పై ఎక్సైజ్ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
X
  • నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు.. 621 కేసులు, 559 మంది అరెస్ట్..
  • 31 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 100 వాహనాలు సీజ్..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాటుసారాను సమూలంగా నాశనం చేసేందుకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్,గంజాయి, సింథటిక్ డ్రగ్స్ కట్టడికి ఈ నెల 12 నుంచి 21 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పెషల్ డ్రైవ్‌ చేపట్టింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి. హరికిరణ్, డైరెక్టర్ అవినాశ్ మహంతి ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ స్పెషల్ డ్రైవ్‌కు ఇందులో భాగంగా.. మహబూబాబాద్, వనపర్తి, పెద్దపల్లి, మంచిర్యాల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏకకాలంలో దాడులు ముమ్మరం చేశాయి.

621 కేసులు, 559 మంది అరెస్ట్..

గత రెండు రోజులుగా రాష్ట్రంలోని 10 డిప్యూటీ కమిషనర్ల పరిధిలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ముమ్మర దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించి ఏకంగా 621 కేసులు నమోదు చేసి, 559 మంది నిందితులను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 100 వాహనాలను సీజ్ చేశారు. దాడుల్లో 2,258 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోగా.. నాటుసారా తయారీకి అడవుల్లో, శివారు ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచిన ఏకంగా 31,570 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి నేలపాలు చేశారు. అలాగే 7,526 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రైవ్‌లో భాగంగా పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి కేవలం రెండు రోజుల్లోనే 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులపైనా దాడులు నిర్వహించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అలాగే, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదు మద్యం దుకాణాల పైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.

ప్రజా ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా..

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 321 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి.. 1,294 కిలోల గంజాయి, 1.88 కిలోల ఓజీ కుష్,2.26 కిలోల హషీష్ ఆయిల్, 4.98 కిలోల భాంగ్, 47.1 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అలాగే, పన్నులు చెల్లించకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు సంబంధించి 446 కేసులు నమోదు చేసి ఏకంగా 3,709 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా స్పెషల్ డ్రైవ్‌తో మత్తు రహిత తెలంగాణ సాధన దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Next Story