మోడీ, కేసీఆర్‌లు ఇద్దరూ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులే: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
మోడీ, కేసీఆర్‌లు ఇద్దరూ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులే: రేవంత్ రెడ్డి
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మహాత్మాగాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడికి పూలమాలలు సమర్పించి, ఘన నివాళలు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆంగ్లేయుల చెరనుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించడానికి గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. దండియాత్ర, క్విట్‌ ఇండియా ఉద్యమంలో 'డూ ఆర్ డై' నినాదంతో దేశానికి స్వాతంత్ర్యం అందించారని గుర్తుచేశారు. గాంధీ స్ఫూర్తితో నెహ్రూ హరిత విప్లవం తీసుకొచ్చారని అన్నారు. సాగునీటిని రైతులకు అందించి దేశంలో దారిద్ర్యాన్ని పారద్రోలారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు అధికారం అందించిన శక్తి కాంగ్రెస్ పార్టీ అని వ్యా్ఖ్యానించారు.

బీజేపీ విషవృక్షం ప్రస్తుతం దేశాన్ని కబాలించాలని చూస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, మోడీలు ఇద్దురూ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలనుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకు రావాలని పిలపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కూడా బీజేపీ విధానాలనే అవలంభిస్తున్నాడని అన్నారు. ప్రజల మధ్య విద్వేషపు గోడలు నిర్మించాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా రాహుల్ గాంధీ యాత్రకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వీహెచ్, ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ వెంకట్ సహా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed