మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలి: CM సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలి: CM సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మే 7 నుంచి జూన్‌ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీ వేస్తామని, 10 నుంచి 12లక్షల మందితో జూన్ లో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలుంటారని, అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో మన పని మొదలవుతుందని, ప్రతీ గడపను తాకండి. ప్రతీ మనిషినీ పలకరించండి అని నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తెలంగాణ భవన్ లో బుధవారం మహారాష్ట్ర చంద్రపూర్, గడ్చిరోలి, యమాత్మాన్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదని, దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ప్రకటించారు. 50 ఏళ్లుగా రాజకీయాలను చూస్తున్నానని అన్నారు.

దేశంలో కావల్సినంత నీరున్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. నీటి సంక్షోభం వెనుక కారణం ఏంటీ?నీళ్లు ఎక్కడా.. ఏ ఫ్యాక్టరీలో తయారు కావు.. దేవుడు ఇచ్చిన వరం అన్నారు. అయినా నీళ్లు ఇవ్వడానికి ఎవరు ఆలోచించరని, మనదగ్గరపట్టింపు లేదన్నారు. ఏ రాజకీయ నాయకుడికి నీటి గురించి చింత లేదని మండిపడ్డారు. ఓట్లు పడుతున్నాయి.. వాళ్ల దుకాణం నడుస్తోందని, అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని సూచించారు. మనలో చైతన్యం రానంతవరకు మన జీవితంలో మార్పురాదన్నారు. కరెంటు విషయంలో తెలంగాణ తప్ప దేశమంతా సంక్షోభమేనన్నారు.

‘మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణలో సాధ్యమైనన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు. మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి. జిల్లా పరిషత్‌ ఎన్నికలతో మన పని మొదలవుతుంది. ప్రతీ గడపను తాకండి. ప్రతీ మనిషినీ పలకరించండి’ సీఎం కేసీఆర్ అన్నారు.

‘దేశంలో అతివృష్టి, అనావృష్టి చూశాం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కానీ నాయకులకు ఎలాంటి రంది లేదు. ఎంతమంది రైతులు మరణించినా రాజకీయ నాయకులకు ఫరక్ పడదు. రైతులు ఎందుకు ఆత్మహ‌త్య చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలి. దేశంలో ప్రతీ ఎకరానికి సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నదే బీఆర్‌ఎస్‌ నినాదం. బీఆర్ఎస్ ఈ నాట‌కాల‌న్నీంటికి చ‌ర‌మ‌గీతం పాడుతుంది. సాగు, తాగు నీరు అందిస్తాం. దీనిపై బీఆర్ఎస్ శ‌ప‌థం చేస్తుందన్నారు

మహారాష్ట్రలో 12 నదుల కంటే ఎక్కువగా పారుతున్నాయి. పెన్ గంగా, వార్దా, గోదావరి ఉన్నా ఔరంగాబాద్ అకోలాలో తాగునీటి కోరతేనన్నారు. గడ్చిరోలిలో నది ప్రవాహం ఉన్నా. .అక్కడ సాగు, త్రాగునీరు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. మహారాష్ట్రే కాదు దేశంలోని ప్రతి ఇంటికి, రైతుకు నీళ్లు అందించడమే బీఆర్ఎస్ లక్ష్యం అన్నారు. స్వరాష్ట్ర తెలంగాణలో ఆత్మహత్యలు లేవు...వలసలు పోయినవారు తిరిగి వచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతుసంక్షేమ పథకాలతో సాధ్యమైందన్నారు. తెలంగాణలో రైతులకు అండగా సర్కార్ ఉందన్నారు.

ధర్మం గెలవాలంటే యుద్ధంలో అప్పుడప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేశామని, రైతు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 15నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నారు. రైతుబాగు కోసం బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అక్కడక్కడా అవాకులు చెవాకులు చేసే వాళ్ళు ఉంటారని పట్టించుకోవద్దు అని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మహారాష్ట్రకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed