తెలంగాణ సీఎం మహిళలకు అన్యాయం చేసిండు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 05:27:51  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు

తెలంగాణ సీఎం మహిళలకు అన్యాయం చేసిండు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని, అది గోదావరిలో కొట్టుకుపోయినట్లేనని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఇప్పుడు మళ్లీ ‘యూ-టర్న్’ తీసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో చెప్పి, ఇప్పుడు సీబీఐకి కేవలం రూ.9 వేల కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాశారని కామెంట్ చేశారు. అసలు ఏ ఆధారాలను బట్టి సీబీఐ విచారణ చేపట్టాలో ఆయనే స్పష్టత ఇవ్వాలన్నారు. ఎత్తిపోతలకు వాడిన ఒక్కో మోటారు విలువ రూ.300 కోట్లు అయితే.. రూ.1,600 కోట్లు ఖర్చు చేసి వేరే దేశాల నుంచి పట్టుకొచ్చారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతి మొత్తం బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ కేసుల్లో కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యుల్లో ఒక్కరిపై అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఆ ఇద్దరికి పదవులొస్తే సరిపోతుందా?

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని రాష్ట్రంలోని అతివలకు సీఎం రేవంత్ రెడ్డిని తీరని అన్యాయం చేశారని బండి సంజయ్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలిన్ అని అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలకు పదవులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. విపక్ష కుటుంబాల్లోని మహిళలు అభివృద్ధి చెందితే సరిపోతుందా అని సెటైర్లు వేశారు. సీఎం, మాజీ సీఎంల భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్‌కు కూడా ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో గతంలో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందని, పొత్తు ఉంటే వారితో పెట్టుకుంటారు కానీ.. బీజేపీతో ఎందుకు పెట్టుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Next Story