గులాబీ కండువా క‌ప్పుకోగానే జీవ‌న్ రెడ్డి కూడా అబ‌ద్దాలు చెప్తున్నారు : విప్ ఆది శ్రీనివాస్

by Naga Rani Yarlagadda |

గులాబీ కండువా క‌ప్పుకోగానే మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి కూడా అబ‌ద్దాలు మొద‌లు పెట్టారని, తెలంగాణ భ‌వ‌న్ అబ‌ద్దాల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

గులాబీ కండువా క‌ప్పుకోగానే జీవ‌న్ రెడ్డి కూడా అబ‌ద్దాలు చెప్తున్నారు : విప్ ఆది శ్రీనివాస్
X
  • రేవంత్ రెడ్డి పైన అక్కసుతోనే జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యలు
  • నిరుద్యోగుల‌పైన బీఆర్ఎస్ నేతలది క‌ప‌ట ప్రేమ

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ కండువా క‌ప్పుకోగానే మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి కూడా అబ‌ద్దాలు మొద‌లు పెట్టారని, తెలంగాణ భ‌వ‌న్ అబ‌ద్దాల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పైన అక్కసుతో జీవ‌న్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రజా పాల‌న పోవాలి, పాపాల భైర‌వుడు రావాల‌ని జీవ‌న్ రెడ్డి అంటున్నారు..పాపాల భైర‌వుడి పాల‌నను శాస‌న‌మండ‌లిలో ఒంట‌రిగా ఎదుర్కున్నాన‌ని జీవ‌న్ రెడ్డే ఆనాడు మాట్లాడారని, ఎందుకు ప్రజా పాల‌న పోవాలో ఆయన జ‌వాబు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స‌న్న బియ్యం గేమ్ ఛేంజ‌ర్ అని జీవ‌న్ రెడ్డే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రజా పాలన పోవాలనా? అని ఆయన మండిపడ్డారు. జీవ‌న్ రెడ్డి తెలంగాణ భ‌వ‌న్ కు వెళ్లగానే 17 ఉద్యోగాలే భ‌ర్తీ చేశామ‌ని అబద్దాలు చెపుతున్నారని, కాంగ్రెస్ లో ఉన్నని రోజులు జీవ‌న్ రెడ్డి తమ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చింద‌ని అనేక సార్లు చెప్పారని, ఆది శ్రీనివాస్ తెలిపారు. జీవో నెంబ‌ర్ 7 ను ర‌ద్దు చేయాల‌ని జీవ‌న్ రెడ్డి అంటున్నారని, కానీ, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ను కాలేజీ ఖాతాల్లోకి కాకుండా విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా వేయ‌డ‌మే జీవో నెంబ‌ర్ 7 ఉద్దేశం.. విద్యార్థులు, వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు నేరుగా భ‌రోసా ఇవ్వడ‌మే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు. కాలేజీ యాజ‌మాన్యాల‌కు అనుకూలంగా జీవ‌న్ రెడ్డి, బీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడుతున్నారని, కాలేజీ యాజ‌మాన్యాలు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడ‌కుండా ఉండ‌టం కోస‌మే నేరుగా విద్యార్థుల ఎకౌంట్లలో ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ వేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. అధికారం పోయాక నిరుద్యోగుల‌పైన బీఆర్ఎస్ నాయ‌కులు క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆ త‌ర్వాత మాట మార్చింది కేసీఆర్ అని, క‌ల్వకుంట్ల కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల‌ను మాత్రం మోసం చేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో నోటిఫికేష‌న్లు ఇవ్వలేదని, నోటిఫికేష‌న్లు ఇచ్చినా ప్రవేశ ప‌రీక్షలు పెట్టలేదని, ప‌రీక్షలు పెట్టినా పేప‌ర్లు లీక్ చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయ‌కులు ఉనికి కాపాడుకోవ‌డం కోస‌మే ప‌స‌లేని విమ‌ర్శలు చేస్తున్నారని, అబద్దాల‌కు కేరాఫ్ అడ్రస్ లు కేటీఆర్, హ‌రీష్ రావులు అని ఆయన ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం ప‌క‌డ్బందీగా ఉద్యోగాలు చేప‌ట్టిందని, ప్రజ‌ల ఆశీర్వాదం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు.

Next Story