త్వరలో తెలంగాణ అసెంబ్లీ సెషన్.. డేట్ ఫిక్స్ చేయడంపై చర్చలు!

by Disha Web Desk 9 |
త్వరలో తెలంగాణ అసెంబ్లీ సెషన్.. డేట్ ఫిక్స్ చేయడంపై చర్చలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లుల కోసం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సెషన్‌లో గవర్నర్ సూచించిన సవరణల ప్రకారం బిల్లును ఆమోదించడమో లేక తిరస్కరించడమో అనే అంశంపై సభ చర్చించనుంది. రెండోసారి పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. అయితే రెండో సారి సభ ఆమోదంతో వచ్చిన బిల్లులపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ ప్రభుత్వంలో ఉంది. వాటిని వెంటనే ఆమోదిస్తారా? వివరణలు అడుగుతారా? లేక రాష్ట్రపతి పరిశీలన కోసం పంపుతారా? అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలపై త్వరలో జరిగే కేబినెట్ బేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని తెలుస్తున్నది.

గవర్నర్ సూచనలు పాటిస్తారా?

గవర్నర్ రెండు బిల్లులను వెనక్కి పంపారు. మెడికల్ ప్రొఫెసర్ వయోపరిమితి బిల్లు, మున్సిపాల్టీల్లో మైనార్టీలను కో– ఆప్షన్ మెంబర్లుగా నియమించే బిల్లు. ఈ రెండు బిల్లులపై గవర్నర్ పలు సూచనలు చేశారు. ఈ సూచనలను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేసే స్వేచ్ఛ అసెంబ్లీకి ఉంది. ఒకవేళ తిరస్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉంటే వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహరిస్తోన్న తీరుపై మంత్రులు, అసెంబ్లీ వేదికగా ఎటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

రెండోసారైనా ఆమోదించేనా?

రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదిస్తారా? లేదా? అనే గుబులు ప్రభుత్వంలో ఉంది. రెండోసారి పంపిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలనే రూల్ రాజ్యాంగంలో లేదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రెండోసారి గవర్నర్ ఆమోదానికి వెళ్లిన బిల్లులను వెంటనే ఆమోదించవచ్చని, లేకపోతే ఎంత కాలమైనా అక్కడ పెట్టుకోవచ్చిన, అలా కాకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీకి పంపే చాన్స్ ఉంది.

చరిత్రలో మొదటి సారి

గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నంత కాలం రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజ్‌భవన్ వెంటనే ఆమోదించి పంపేది. కానీ గవర్నర్‌గా తమిళిసై వచ్చిన కొత్తలో అంతా సాఫీగా జరిగింది. కానీ హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత మెల్లమెల్లగా ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఏడాదిన్నరగా మరింత ముదిరి పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లి, చివరికి వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో గవర్నర్ బిల్లులను వెనక్కి పంపడం, వాటిపై రెండోసారి అసెంబ్లీలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అవుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు?



Next Story

Most Viewed