షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ సెషన్.. పెండింగ్ బిల్లులకూ లైన్ క్లియర్!

by Disha Web Desk 2 |
షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ సెషన్.. పెండింగ్ బిల్లులకూ లైన్ క్లియర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లపై వాదనల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దానికి అనుగుణంగా మంత్రి వేముల ప్రశాంత్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్ళి గవర్నర్‌తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రసంగించాల్సిందిగా తమిళిసై సౌందర్‌రాజన్‌ను ఆహ్వానించారు. మంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు కూడా ఆమెను ఆహ్వానించారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. వివాదం కొలిక్కి రావడంతో ఫార్మాలిటీ ప్రకారం గవర్నర్‌ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించాల్సిందిగా వారికి కేసీఆర్ సూచించారు. ఆ ప్రకారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారులు సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సెషన్ వివరాలను వెల్లడించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపడంపైనా చర్చించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడానికి అసెంబ్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి ఛైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆమెకు సాదరంగా స్వాగతం పలకనున్నారు.

బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలియజేయడంతో తుది ప్రతికి మెరుగులు దిద్దే ప్రక్రియ వేగవంతమైంది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3న ఉభయ సభలను ఉద్దేశించి మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజున ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరిగి ఆమోదం పొందనున్నది. ఆ తర్వాత ఆదివారం సెలవు ఇచ్చి సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం 10.30 గంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఎన్ని రోజులు సభ జరగాలి, ఏయే అంశాలపై చర్చించాలి, వివిధ శాఖల డిమాండ్లు-గ్రాంట్లపై చర్చలకు ఎంత సమయం ఇవ్వాలి తదితరాలపై క్లారిటీ రానున్నది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశమున్నది.


Next Story