ఏపీ నుంచి తెలంగాణ టీచర్లను రప్పించండి.. సీఎస్‌కు ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి

by Disha Web Desk 2 |
ఏపీ నుంచి తెలంగాణ టీచర్లను రప్పించండి.. సీఎస్‌కు ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణకు చెందిన టీచర్లను తిరిగి సొంత రాష్ట్రానికి రప్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు లేఖ రాశారు. తెలంగాణకు చెందిన 1808 మంది ఏపీలో ఉన్నారని, పిల్లల చదువులు, స్పౌస్, వ్యక్తిగత కారణాలతో స్వరాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, దీనికిగాను నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ వోసీ) జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి 1369 మంది ఉద్యోగులు ఏపీకి వెళ్తే, 188 మంది తెలంగాణకు వస్తున్నారని అంటే 439 మంది ఉద్యోగులు అదనంగా వివిధ హోదాల్లో తెలంగాణకు వస్తున్నట్లు తెలిపారు. వీరికి అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్ పీ ఎఫ్)లో 96 మంది ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడి ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కోల్పోయే అవకాశముందన్నారు. ఇప్పటికే సచివాలయం, పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో స్పౌస్ పేరిట ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని, వారిని తిరిగి వారి మాతృ సంస్థలకు తిరిగి పంపించాల్సిన అవసరముందన్నారు. ఏపీలో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ఉద్యోగలకు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి పరిష్కరించాలన్నారు.

Next Story

Most Viewed