యూత్ టార్గెట్‌గా టీకాంగ్రెస్ కీలక నిర్ణయం

by Disha Web Desk 9 |
యూత్ టార్గెట్‌గా టీకాంగ్రెస్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని యువత టార్గెట్‌గా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. ఇటీవల టీఎస్పీఎస్‌సీ పేపర్ లీక్ విషయంపైనా ఆందోళనను నిర్వహించింది. తాజాగా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా ఓ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. యువతకు భరోసా ఇస్తూ ఈ నెల 8న హైదరాబాద్‌లో భరోసా సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీని తీసుకురానున్నారు. ఆమెతో యువతపై డిక్లరేషన్ ప్రకటించనున్నారు.

ఇప్పటికే యువత ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం పదే పదే యువత సమస్యలపై ప్రస్తావిస్తున్నారు. తాజాగా కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన తెలంగాణ యువతలో తీవ్ర ఆవేదన ఉందని చెప్పారు. నిరాశలో ఉన్న యువతకు భరోసా కల్పించేందుకే తాము భరోసా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత భరోసా సభలో ప్రియాంకగాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఏం చేయనుందో చెప్పనున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Next Story

Most Viewed