బిగ్ న్యూస్: T-టీడీపీలో ఓపెన్ టికెట్ ఆఫర్.. కానీ ఆ ఒక్క పని చేయాల్సిందే!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: T-టీడీపీలో ఓపెన్ టికెట్ ఆఫర్.. కానీ ఆ ఒక్క పని చేయాల్సిందే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పూర్వవైభవం కోసం టీడీపీ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా ముందుగా పార్టీ నేతలకు సభ్యత్వాలను టార్గెట్‌గా పెట్టింది. పూర్తిచేసిన వారికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. ఎవరైతే యాక్టీవ్ గా పనిచేస్తారో వారికే పార్టీ కమిటీల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. దీంతో పార్టీ నేతలు లక్ష్యం చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 84 అసెంబ్లీ స్థానాల్లో సభ్యత్వాలు దాదాపు పూర్తి కావస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే.. రాష్ట్రంలోని 119 సెగ్మెంట్లలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు గతనెల 26 నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజెప్పడంతో పాటు సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేతలకు సభ్యత్వాల టార్గెట్ గా కూడా పెట్టింది. ప్రతి సెగ్మెంట్ లో 30వేలు చేస్తే పార్టీ టికెట్ ఇస్తామనే ఆఫర్‌ను ఇచ్చింది. ఎవరు చేస్తే వారికే టికెట్ అని చెప్పడంతో నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి సెగ్మెంట్ లో సభ్యత్వాలను ముమ్మరం చేశారు. ఓ వైపు ఇంటింటికీ టీడీపీ ప్రోగ్రామ్ తో పాటు మరోవైపు ప్రజావ్యతిరేక విధానాలపైనా పోరాటాలు కొనసాగిస్తున్నది.

నేతల పనులు నమోదు

ఇంటింటికీ టీడీపీలో భాగంగా ర్యాలీలు, పార్టీ జెండాల ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ కొనసాగిస్తున్నారు. రోజూవారీగా నేతలు చేపట్టిన పనులను నమోదు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తేవడమే లక్ష్యమని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజల నుంచి ఆదరణ వస్తుందని, రాబోయే ఎన్నికల్లో బరిలో నిలుస్తామని స్పష్టం చేశారు.

అదే విధంగా పార్టీ శ్రేణులకు రోజువారీ కార్యక్రమాలపై రాష్ట్ర కార్యాలయం నుంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి పనితీరు ఆధారంగానే పార్టీ కమిటీల్లో గుర్తింపు లభించనుంది. అంతేకాదు ఇతరపార్టీల నుంచి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నవారిని సైతం ఆహ్వానించేందుకు త్వరలోనే జిల్లాల వారీగా సభలు నిర్వహించనున్నట్లు తెలిసింది. గతంలో పార్టీని వీడినవారితో సైతం త్వరలోనే భేటీ కానున్నట్లు సమాచారం.

రంగంలోకి చంద్రబాబు..?

టీడీపీలో పనిచేసి పార్టీని వీడినవారిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నాడు కీలకంగా పనిచేసిన తెలంగాణ నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చుకునేందుకు త్వరలోనే సంప్రదింపులు సైతం చేపట్టనున్నట్లు సమాచారం. ఆ నేతలను తిరిగి టీడీపీ గూటికి చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందనే ఆశాభావంలో ఉన్నారు. మొన్న ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read..

ఎన్నికల నాటికి బలపడకుంటే సైకిల్ పార్టీ చతికిలపడినట్లేనా?


Next Story

Most Viewed