దళితులంటే కేసీఆర్ కుటుంబానికి ద్వేషం: తరుణ్ చుగ్

by Disha Web Desk 19 |
దళితులంటే కేసీఆర్ కుటుంబానికి ద్వేషం: తరుణ్ చుగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితులు, ఓబీసీలు, విద్యార్థులంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ద్వేషమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ విమర్శలు చేశారు. సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి ఆయన బుధవారం ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీరు తెలంగాణలో విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదన్న విషయం స్పష్టమవుతోందని, ఇలాంటి ఘటనలు తెలంగాణ సమాజాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనపై తెలంగాణలో ప్రతి వర్గం విసిగిపోయిందని, మూడేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల పంపిణీ మరిచిపోయిందని విమర్శలు చేశారు.

దీంతో 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడిందని, ఎస్సీ విద్యార్థుల కోసం కేటాయించిన నిధుల్లో 50 శాతం లోపే ఖర్చు చేశారన్నారు. కళాశాలలో ర్యాగింగ్‌పై సీనియర్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలు, రైతులు, విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని చురకలంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ టూర్లతో బిజీబిజీగా గడుపుతున్నారని, పాలన పట్టించుకోవడంలేదన్నారు. ప్రీతి మృతి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed