సెంట్రల్‌ యూనివర్సిటీలో దాడులు ఆపాలి: తమ్మినేని

by Disha Web Desk 2 |
సెంట్రల్‌ యూనివర్సిటీలో దాడులు ఆపాలి: తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో గత వారం రోజులుగా ఏబీవీపీ నాయకత్వంలో అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయని.. ఆ దాడులను వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థినులతో సహా 20 మంది విద్యార్థులు, ఏబీవీపీ దాడిలో గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు విద్యార్థినులతో సహా ఆరుగురు హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వాతావరణంలో సున్నితమైన అంశాలు ముందుకుతెచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నంలో ఒక పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తక్షణం విచారణ జరిపి దోషులను శిక్షించాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండు చేశారు. ఈనెల 13న జరిగిన ఫేర్‌వెల్‌ వేడుకలలో ఏబీవీపీ కార్యకర్తలు వికలాంగుడైన హర్షరాజ్‌పై దాడి చేయడంతో, ఎస్‌ఎఫ్‌ఐ ఇతర సంఘాల నాయకులు సర్దుబాటుకు ప్రయత్నించారని తెలిపారు. అనంతరం 17వ తేదీ ఒక పథకం ప్రకారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త ఫైజల్‌పై దాడి చేసి విద్యార్థులను గాయపరిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌ తరలిస్తుండగా, అంబులెన్స్‌ను కూడా ఈ మూక అడ్డుకున్నదని అమ్మాయిలను లైంగికంగా వేధించారని, వీడియోలలో ఈ విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయనీ తెలిపారు. దాడి జరగకుండా నివారించే ప్రయత్నం చేసిన వారిని కూడా కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.



Next Story