ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలు.. సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ

by Disha Web Desk 19 |
ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలు.. సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 7000 కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో పది శాతం కూడా సేకరించలేదని విమర్శించారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడవటమే కాక నీటిలో కొట్టుకుపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. దీనికితోడు కొనుగోళ్ళలో ఐకేపీ, సొసైటీ, మార్కెట్‌ కమిటీ, మిల్లర్లు మిలాఖతై తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు.

మార్కెట్లో ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని, అయినప్పటికీ మార్కెట్‌ నుంచి మిల్లుకు వెళ్ళిన తర్వాత మిల్లర్లు ఐకేపీ ఏజెంట్లను పిలిచి, ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదని క్వింటాలుకు 4 కిలోల వరకు తగ్గించి ఇస్తున్నారన్నారు. రైతుకు చెల్లించాల్సిన డబ్బులలో పది శాతం కోత పెడుతున్నారని, అంతేకాకుండా తాలు, మట్టి ఉన్నాయనే పేరుతో కూడా మోసం చేస్తున్నారని వివరించారు. గత 2 ఏళ్ళుగా ఇలాంటి పద్ధతినే అనుసరించి ఏటా రు.500 కోట్లు రైతులకు నష్టం కలిగించారని, తిరిగి ఈ యాసంగిలో కూడా ఇదే తరహాలో మోసానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ''ఉప్పుడు బియ్యం''గా మార్చాలని, అందువల్ల తేమ ఒక యూనిట్‌ ఎక్కువ, తక్కువ ఉన్నా ప్రమాదం లేదని సూచించారు. పైగా వాతావరణంలో 46 డిగ్రీల వేడి కొనసాగుతున్నదని, ఈ ఎండలో ధాన్యం ఒక గంట ఉన్నట్టయితే నిర్ణీత తేమ శాతం కన్నా తక్కువకు పడిపోతుందన్నారు. అందువల్ల మిల్లర్లు విధిగా తేమ కలపుతారని, తద్వారా ఉప్పుడు బియ్యం క్వింటాలుకు 68 కిలోల దిగుబడి వస్తుందన్నారు.

ఇది మిల్లర్లకు అదనపు లాభం అయినప్పటికీ రైతుల చెల్లింపులలో కోత విధించడంపై మార్కెట్లలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయని, అయినా మోసాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవని ఆరోపించారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి విజిలెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మార్కెట్‌లో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించి ధాన్యం నాణ్యతా ప్రమాణాలను సర్టిఫై చేయాలని సూచించారు. రైతులకు జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed