ఆ వ్యాపారానికి తెరదించకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు బండి వార్నింగ్

by Disha Web Desk 19 |
ఆ వ్యాపారానికి తెరదించకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు బండి వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితులు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను చేస్తున్నారని, దీన్ని ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని మీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాది మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయని బండి ఫైరయ్యారు. అది పోగా ఎప్పుడో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే రియల్‌ వ్యాపారం కోసం ఆ భూములను లాక్కోవాలని చూడడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమేనని ఆయన పేర్కొన్నారు.

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానంటూ హామీలివ్వడమే కానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్‌ వేసింది దళితుల భూముల్లోనేనని ఆయన ఆరోపించారు. శంషాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనేనని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను వారి నుంచి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు.

సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని బండి ప్రశ్నించారు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదని, వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమని సంజయ్ పేర్కొన్నారు. అంతో ఇంతో ఉన్న జీవనోపాధిని సైతం కోల్పోయి బీఆరెస్ పాలనలో దళితులు, గిరిజనలు అన్ని విధాల తీవ్రంగా నష్టపోయారని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల మీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరం అవుతున్నారని సంజయ్ విమర్శలు చేశారు.

దళితులు, గిరిజనుల బతుకులు ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించాలని, దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే దళితులు, గిరిజనుల పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీకి బండి సంజయ్.. ఈటల వెళ్లి రాగానే వెళ్లడంతో కొత్త చర్చ!

Next Story

Most Viewed