స్వప్నలోక్ అగ్నిప్రమాదం : నర్సంపేటలో విషాదం..!

by Disha Web Desk 4 |
స్వప్నలోక్ అగ్నిప్రమాదం : నర్సంపేటలో విషాదం..!
X

దిశ, నర్సంపేట: సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడిన ఆరుగురిలో ముగ్గురు నర్సంపేట నియోజక వర్గానికి చెందిన వారే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఊరును వదిలి నగర బాట పట్టిన వారికి విషాదం మిగిలింది. అనుకోని రీతిలో అగ్ని ప్రమాదబారిన పడి మృతి చెందడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు ,రజితలకు ఒక కుమారుడు శివ, కుమార్తె ఉన్నారు. శివ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని తండ్రి రాజు వ్యవసాయం, తాపీ మేస్త్రి‌గా పని చేసుకుంటున్నాడు.

దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామనికి చెందిన వంగ రవి కుమార్తె వంగ వెన్నెల. గత మూడు ఏండ్లుగా వెన్నెల హైదరాబాద్‌లోని ఈ కామర్స్ సంస్థలో పని చేస్తోంది. కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఉద్యోగం చేస్తున్న వెన్నెల ఆకస్మిక మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.

ఖానాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో బానోతు శ్రావణి కుటుంబం నివాసం ఉండేది. బానోతు నర్సింహ, రాంబాయి దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు శ్రావణి బీటెక్ పూర్తి చేసింది. గత ఆరు నెలల నుండి కాల్ సెంటర్‌లో పని చేస్తున్నది. పదో తరగతి అశోక్ నగర్‌లోని కస్తూర్భాలో, ఇంటర్ నర్సంపేటలోని త్రివేణి జూనియర్ కాలేజీలో చదివినట్లు సమాచారం. శ్రావణి కుటుంబం నాలుగు ఏండ్ల కిందటే హైదరాబాద్‌కి వలస వెళ్లారు.

ముగ్గురూ పాతికేళ్లలోపు వారే..

సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో మృతి చెందిన వారి వయసు అందరిదీ దాదాపుగా పాతికేళ్లలోపే. చిన్న వయసులోనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉందామనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కింది ఫ్లోర్ నుండి వ్యాపించిన మంటలు చూస్తుండగానే వీరి ఫ్లోర్‌ని చుట్టూ ముట్టాయి. భయంతో బాత్రూం‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. దాదాపు రెండు మూడు గంటల పాటు వారు ఫోన్‌లు ఆన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కాల్స్ మాట్లాడిన అనంతరం వారి ఫోన్‌లు ఆఫ్ అయినట్లు సమాచారం. పొగలు దట్టంగా వ్యాపించడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

గాంధీ ఆస్పత్రికి చేరుకున్న మృతుల కుటుంబీకులు...

నర్సంపేట నియోజక వర్గానికి చెందిన శివ, శ్రావణి, వెన్నెల కుటుంబీకులు ఇప్పటికే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మృతదేహాలను నర్సంపేటకు తీసుకురానునట్లు సమాచారం. ఒకే ప్రమాదంలో నర్సంపేట డివిజన్‌కు చెందిన ముగ్గురి మృతితో వారి స్వ గ్రామాలు సహా నర్సంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed