మిర్చీ పంటపై సర్వే.. రెండు కమిటీలతో అధ్యయనం

by Disha Web Desk 1 |
మిర్చీ పంటపై సర్వే.. రెండు కమిటీలతో అధ్యయనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం మిర్చి మార్కెట్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా మార్కెట్లలో జరిగే అమ్మకాలు, కొనుగోళ్లపై ముఖ్యంగా మిర్చీ మార్కెట్లలో పడిపోతున్న ధరల గూర్చి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మార్కెట్లలో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా, ధరలు పడిపోకుండా చూడాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గత 15 రోజులుగా ఖమ్మం మార్కెట్‌కు రైతులు రోజుకు రూ.10 వేల బస్తాలకు పైగా వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిండా ముంచుతున్నారు. వాస్తవానికి గురువారం మార్కెట్‌లో ఎండు మిర్చి జెండా పాట రూ.23,150గా నిర్ణయించగా రైతులు సంబురపడ్డారు. తీరా కొనుగోళ్లు మొదలయ్యాక వ్యాపారుల మాయాజాలం బయటపడింది. మార్కెట్‌లో జెండాపాట రూ.23,150 పలకగా, వ్యాపారులు మాత్రం రూ.13 వేల నుంచి రూ.14 వేలకు మించి ధరను అడగడం లేదు.

పంట నష్టం, మద్దతు ధరలపై మంత్రి ఫోకస్

సీజన్ ఆరంభం నుంచి అనేక కష్టాలు, నష్టాలు మిర్చీ రైతును వెంటాడుతున్నాయి. అధిక వర్షాలు, తెగుళ్లతో దిగబడులు గణనీయంగా తగ్గగా పంట చేతికొచ్చే సమయంలో మిగ్​జాం తుపాను రైతులను నట్టేట ముంచింది. మిగిలిన కొద్ది పంటను తీసుకొచ్చిన మిర్చి రైతులు మార్కెట్ మాయాజాలంతో నష్టపోతున్నారు. మిర్చి రైతులకు జరుగుతున్నా.. ఇబ్బందులను చెక్ పెట్టనందుకు అలాగే రైతులకు కనీస మద్దతు ధర అందించే లక్ష్యంతో మంత్రి తుమ్మల చర్యలు చేపట్టారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు జరుగుతున్న పంట నష్టం, మద్దతు ధరలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిర్చి పంటను పండించే జిలాల్లో పంట నష్టానికి గల కారణాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సర్వేకు రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ యూనివర్సిటీ అధికారులు ఆ కమిటీలో ఉండనున్నారు.

నేటి నుంచి సర్వే..

పంట నష్టం జరిగిన జిల్లాలో మొదటి దశలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో ముందుగా గురువారం నుంచి సర్వే నిర్వహిస్తారు. అనంతరం మిర్చి పండించే మిగతా జిల్లాలో సర్వేను నిర్వహిస్తారు. ఈ సర్వేలో అధికారులు స్వయంగా రైతులను కలుసుకుని మిర్చి పంట నష్టానికి గల కారణాలు, మద్దతు ధర విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చి రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ నివేదిక రూపంలో మంత్రికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదించనున్నారని సమాచారం.



Next Story