CPI Leader: అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర.. సీఎం ఆదేశాలు.. అంతిమయాత్ర వివరాలు

by Ramesh Naini |   (  Updated:2025-08-23 09:08:08  IST  )

కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CPI Leader: అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర.. సీఎం ఆదేశాలు.. అంతిమయాత్ర వివరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy)కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్​ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

అంతిమయాత్ర వివరాలు..

1. ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్‌ హాస్పటల్‌, గచ్చిబౌలి నుండి భౌతికకాయం మఖ్దూం భవన్‌కు తరలింపు

2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచబడుతుంది.

3. మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్‌ నుంచి గాంధీ మెడికల్‌ కాలేజీకి వరకు అంతిమ యాత్ర

4. సాయంత్రం 5 గంటలకు పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మెడికల్‌ కాలేజీకి అప్పగింత

అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలు ధరించి అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ మేరకు శనివారం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అధికార లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు వెల్లడించారు. వెంటనే సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఊరేగింపు కంటే ముందు అధికార లాంఛనాలతో భౌతికకాయానికి గౌరవ సూచకంగా నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

Next Story