అలా జరుగలేదంటే.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలి.. టీ.బీజేపీ నేతలకు బన్సల్ సంచలన వార్నింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-29 13:09:35  IST  )

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరుగుతోంది.

అలా జరుగలేదంటే.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలి.. టీ.బీజేపీ నేతలకు బన్సల్ సంచలన వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్(Sunil Bansal) హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కీలక నేతలపై సీరియస్ అయ్యారు. మండల కమిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. మే 15వ తేదీలోగా మండల కమిటీలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. లేదంటే జిల్లాల అధ్యక్షులు రాజీనామాలు చేయల్సి ఉంటుందని సంచలన హెచ్చరిక చేశారు. నకిలీ క్రియాశీలక సభ్యత్వాలు చేయించడంపైనా మండిపడ్డారు. 13 వేల వరకు నకిలీ సభ్యత్వాలు ఉన్నాయని అన్నారు. అంతేకాదు.. బీజేపీ(Telangana BJP) పోరాటాల్లోనూ వేడి తగ్గిందని.. క్షేత్రస్థాయి పోరాటాల్లో వేగం పెంచాలని చెప్పారు. అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అందుకు సిద్ధంగా ఉండాలని.. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS)​విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో వంటి అంశాలపైనా చర్చించారు. అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రపూరితంగా వ్యవహరించాయని సీరియస్ అయ్యారు. పోటీ ఎమ్ఐఎమ్, బీజేపీ మధ్య ఉంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రెండూ ఎమ్ఐఎమ్‌కు మద్దతిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు.

Next Story