మణిపూర్ to హైదరాబాద్.. విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం

by Disha Web Desk 2 |
మణిపూర్ to హైదరాబాద్.. విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న విద్యార్థుల్లో 75 మంది సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మిగిలిన వారు కోల్‌కతా మీదుగా ఈరోజు(ఏప్రిల్ 8) సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత విద్యార్థులను వారి వారి స్వస్థాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రిజర్వేషన్ల విషయంపై మణిపూర్‌లో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అల్లర్లలో 50 మందికి పైగా చనిపోయారు. దాంతో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో ఆ రాష్ట్ర గవర్నర్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మణిపూర్‌లోని ఇంఫాల్ వర్సిటీ తోపాటు వేర్వేరు విద్యా సంస్థల్లో చదుకుంటున్న 103 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు.

వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావటానికి ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపింది. వీటిలో ఓ విమానం 75 మంది విద్యార్థులతో ఓ విమానం సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మణిపూర్ నుంచి బయలుదేరినట్లు తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఈ విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటుందని చెప్పారు. మిగిలిన విద్యార్థులను కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తీసుకు రానున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను కోల్‌కతా పంపించినట్టు చెప్పారు. కోల్‌కతా నుంచి వచ్చే వారి కోసం టిక్కెట్లు బుక్ చేసినట్టు చెప్పారు. వీళ్లు ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed