విద్యార్థులూ ఊపిరి పీల్చుకోండి..! ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కార్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-09 09:13:57  IST  )

తెలంగాణలోని విద్యార్థులకు హైకోర్టు వేదికగా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేసింది.

విద్యార్థులూ ఊపిరి పీల్చుకోండి..! ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) విడుదల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వేదికగా ఒక తీపి కబురు అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఆగస్టు 15 లోపు ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పూర్తిగా విడుదల చేస్తామని కోర్టుకు విన్నవించారు. కేవలం పాత విద్యార్థులకే కాకుండా, ఈ ఏడాది కొత్తగా చేరిన (New Admissions) అడ్మిషన్లకూ కూడా ఫీజులను చెల్లిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వివిధ కోర్సుల్లో 2వ, 3వ, 4వ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఫీజులు వర్తింపజేస్తూ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి వివరించారు.

సుమారు రూ.1,000 కోట్లు కావచ్చు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ ఏడాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉండవచ్చని కోర్టుకు తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన గడువు ప్రకటనతో ఫీజులు రాక కాలేజీల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించినట్లైంది.

Next Story