- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి ఫిర్యాదులపై కఠిన చర్యలు : ATR తప్పనిసరి - సీఎంసీ కమిషనర్ సృజన
ప్రజావాణి, వాట్సాప్ ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజావాణి, వాట్సాప్ ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన పేర్కొన్నారు. అన్ని విభాగాల అధిపతులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన తీరు, ప్రజలకు మెరుగైన సేవలందించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలనలోని అన్ని విభాగాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలని, పారదర్శకతను పెంపొందించాలని, వ్యక్తిగత విచక్షణకు తావులేకుండా చూడాలని నొక్కి చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం మరియు పౌర సేవలే ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా స్పష్టమైన, బాధ్యతాయుతమైన సమాధానాలతో పరిష్కరించాలన్నారు. సంబంధిత అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, వాటికి సంబంధించిన ఆధారాలను, పత్రాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. కేవలం ఫిర్యాదుల సంఖ్య కాకుండా, పరిష్కార నాణ్యత కూడా ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా తిరస్కరించిన ఫిర్యాదులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్ను, ఇతర పౌర సేవలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న దరఖాస్తులను అనవసరంగా ఆలస్యం చేయడం లేదా తిరస్కరించడం చేయకూడదని తెలిపారు. సిటిజన్ చార్టర్ గడువులను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై జరిమానా విధించబడుతుందన్నారు. టౌన్ ప్లానింగ్, ఆక్రమణల తొలగింపు, మౌలిక సదుపాయాల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండాలని, క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని ఆమె కోరారు. అవినీతి, విధి నిర్వహణలో లోపాలను సహించేది లేదని, పారదర్శకమైన, ప్రజాహితమైన పాలన అందించడమే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యమని స్పష్టం చేశారు.






