ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం.. బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో పండితులు

by Prasad Jukanti |   (  Updated:2026-03-19 08:29:47  IST  )

తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. ప్రతిపక్షం బలోపేతం, నిరుద్యోగం పెంపు, బంగారం ధరల పెరుగుతాయని పండితులు జోస్యం చెప్పారు.

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం.. బీఆర్ఎస్  ఉగాది వేడుకల్లో పండితులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా (Ugadi Celebrations) నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ పండితులు శ్రీ మృత్యుంజయ శర్మ, శ్రీ ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుందన్న పండితులు జోస్యం చెప్పారు. విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

బంగారం ధరలు పైపైకి:

వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయన్నారు. అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని జోస్యం చెప్పారు. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని కూడా హెచ్చరించారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవాన్ని పొందుతుందని, వాణిజ్య రంగంలో దేశం రాణిస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, మానవతా విలువలు పెరుగుతాయని, విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.

ప్రమాదాలు జరిగే చాన్స్:

కొన్ని ప్రాంతాల్లో తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండదని పండితులు వెల్లడించారు.

న్యూ లుక్‍లో కేటీఆర్:

ఎప్పుడు ఫార్మల్ డ్రెస్ కోడ్‍లో కనిపించే కేటీఆర్ ఈసారి ఉగాది వేడుకల్లో న్యూ లుక్‍లో కనిపించారు. వైట్ కుర్తాలో తెలంగాణ భవన్‍కు వచ్చిన కేటీఆర్ అక్కడ జరిగిన పూజాకార్యక్రమాల్లో పాల్గొని పంచాంగ శ్రవణం విన్నారు.

Next Story