కళాకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. బోయినపల్లి వినోద్ కుమార్

by Disha Web Desk 13 |
కళాకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. బోయినపల్లి వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సకల కళలను ఆదరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఎల్.బీ. స్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉండగా, ప్రతి రోజూ కళా పండుగే’ అనే నినాదంతో జానపద కళాకారుల మహా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కళలను, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తోందన్నారు.

జానపద కళలు కనుమరుగు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు. కళాకారులను ఆదుకునేందుకు సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా ప్రభుత్వం ఉపాధిని కల్పించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ర్యాలీ నిర్వాహకులు బత్తిని కీర్తిలతా గౌడ్, గిరి, శరత్ చంద్ర, గడ్డం శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed