ఎన్నికల వరకు తన్నుకుని.. చివర్లో BRS, కాంగ్రెస్ కలుస్తాయ్: బండి సంజయ్

by Disha Web Desk 19 |
ఎన్నికల వరకు తన్నుకుని.. చివర్లో BRS, కాంగ్రెస్ కలుస్తాయ్: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌తో కలవక తప్పదని భువనగిరి ఎంపీ కోమటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో కలవాలని చూస్తోందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ఎక్కడ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతోందని.. అందుకే సీఎం కేసీఆర్ బీజేపీ టార్గెట్ చేశారని బండి ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లతో కలిసి పోటీ చేస్తోందన్నారు. బీజేపీ భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని కాంగ్రెస్సే చెబుతోందని.. అలాంటప్పుడు కాంగ్రెస్ చేసే యాత్రలతో ఏం ఉపయోగమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల వరకు తన్నుకుని.. చివర్లో మాత్రం కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో గెలుస్తుందని బండి ధీమా వ్యక్తం చేశారు.

Next Story