శ్రీశైలం వాటర్ వివాదం.. ఏపీకి మంత్రి జూపల్లి హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-03-31 07:11:32  IST  )

శ్రీశైలంలో ఏపీ అక్రమ విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తే సహించబోమని, పోరాటం తప్పదని హెచ్చరించారు.

శ్రీశైలం వాటర్ వివాదం.. ఏపీకి మంత్రి జూపల్లి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మా పంటలు ఎండుతుంటే మీరు ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని మండిపడ్డారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా అని నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటి నిల్వలు తక్కువగా ఉంటే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలనే నిబంధనలు ఉన్నా ఏపీ మాత్రం అందుకు భిన్నంగా అక్రమంగా నీటిని వాడుతోందని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఇలాగే అక్రమంగా నీటిని తరలించుకుపోయిందని, మేం ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందన్నారు. నాడు మేము హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనలకు అనుగుణంగా శ్రీశైలంలో అక్రమంగా నీటిని తరలించడాన్ని ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరించారు.

మీరేమైనా చదువురాని వాళ్లా?:

శ్రీశైలంలో తెలంగాణకు 64 శాతం వాటా ఉందని ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు ఇంకా జరగలేదన్నారు. ఈ విషయంలో సమాచారం ఇవ్వక పోవడానికి ఏమైనా చదువురాని వారా? జీవోలు ఉన్నాక ఇంకా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు. తెలంగాణ ఎప్పుడో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిందని, ఏపీ చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడవద్దన్నారు. లేదా రైతాంగం, ప్రభుత్వం, పార్టీ సమిష్టిగా పోరాటం చేసి మా హక్కులను కాపాడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీ పట్టించుకోలేదని, గత ప్రభుత్వ తప్పిదాలను ఏపీ అలుసుగా తీసుకుంటోందని ధ్వజమెత్తారు.

Next Story