ఉప్పల్‌లో SRH vs RCB మ్యాచ్.. టికెట్ల డిమాండ్‌పై సైబర్ కేటుగాళ్ల కన్ను

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో జరిగే SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట ఫేక్ యాప్‌లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

ఉప్పల్‌లో SRH vs RCB మ్యాచ్.. టికెట్ల డిమాండ్‌పై సైబర్ కేటుగాళ్ల కన్ను
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌ జరగనుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉప్పల్ రానుండటంతో.. ఈ మ్యాచ్ కువిపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో SRH vs RCB మ్యాచ్ టికెట్లకు ఉన్న క్రేజ్‌ను సైబర్‌ కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. సోషల్ మీడియా వేదికగా అసలు యాప్‌ను తలపించేలా ఉన్న నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Police Commissioner V.C. Sajjanar) హెచ్చరించారు.

ఐపీఎల్ అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్‌' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో సైబర్ నేరగాళ్లు ఈ నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఇలాంటి వాటిలో పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉందని సీపీ స్పష్టం చేశారు. మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని, ఇలాంటి ఫేక్ యాప్ లపై నిఘా ఉంచామని తెలిపారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేశారు.

Next Story