బిగ్ న్యూస్: నూతన సచివాలయ భద్రతపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: నూతన సచివాలయ భద్రతపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటివరకు సచివాలయానికి సెక్యూరిటీ కల్పించిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఆ విభాగం ఇప్పుడు సచివాలయానికి దూరంగానే ఉండనున్నది.

కొత్త సెక్రటేరియట్‌ను ఈ నెల 30న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్యూరిటీపై డీజీపీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సచివాలయానికి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు భద్రత కల్పిస్తుందని, వెంటనే బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంతకాలం సుమారు 290 మంది ఎస్పీఎఫ్ పోలీసులు సెక్రటేరియట్‌కు సెక్యూరిటీ కల్పించారు. ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది. ఇక నుంచి స్పెషల్ పోలీసులు చూసుకోనున్నారు.

తగినంత సంఖ్యలో ఎస్పీఎఫ్ సిబ్బంది లేనందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ చెప్తున్నా దీని వెనక బలమైన కారణాలే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త సెక్రటేరియట్‌కు భారీ స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలని భావించిన ప్రభుత్వం ఇంతకాలం కొనసాగిన సంఖ్యకంటే ఎక్కువగానే నియమించాలని అనుకుంటున్నది. మూడంచెల భద్రతతో పాటు ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ విభాగాల నుంచి కూడా పరిసర ప్రాంతాల్లో భారీ నిఘా కొనసాగనున్నది.

Next Story

Most Viewed