తెలంగాణ హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 9 |
తెలంగాణ హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చినట్లు మంత్రి చెప్పారు. హజ్ హౌస్‌లో అవసరమైన సౌకర్యాలను పూర్తి చేసినట్టు వివరించారు. హైదరాబాద్ నుంచి వివిధ శాఖల సహకారంతో ప్రత్యేక విమాన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికుల వసతి, బస, విమానాల టికెట్ బుకింగ్, బోర్డింగ్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు.

హైదరాబాద్ హజ్ హౌస్ లో పాసులు, సామాను స్క్రీనింగ్, సామాను చెక్ ఇన్, మెడికల్, టీకా వంటివి ఏర్పాటు చేశారని చెప్పారు. శంషాబాద్‌ GMR అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. యాత్రికుల కోసం డయాస్, సిట్టింగ్ ఏర్పాట్లు, బస్ పాయింట్లు దిగడం, సామాను స్ర్కీనింగ్, చెక్ ఇన్ కౌంటర్లు, మొదలైనవి హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాదాపు ఏడు వేల మంది హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు. జూన్ ఐదవ తేదీ నుంచి హజ్‌చార్టర్ విమానాలు నడుపుతారని.. . యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ యాత్రికులు, హజ్ యాత్రికుల కోసం విస్తారా ఎయిర్‌లైన్స్ హజ్ హౌజ్‌కు రిపోర్టు చేస్తారని చెప్పారు. ఆన్‌లైన్ ఈ-బుకింగ్ సిస్టమ్, మాన్యువల్ బుకింగ్ సిస్టమ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ప్రభుత్వ సలహా దారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసి ఉల్లాఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఉన్నతాధికారి షఫీ ఉల్లా ఖాన్, కార్పోరేటర్ రేఖ తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed