అక్రమ ఎంట్రీలకు చెక్.. ధరణి, భూ భారతిపై ప్రత్యేక కమిటీ

by Ramesh Naini |

ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్ తెలిపారు.

అక్రమ ఎంట్రీలకు చెక్.. ధరణి, భూ భారతిపై ప్రత్యేక కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్లు లోకేశ్ కుమార్ తెలిపారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటిని కొందరు అక్రమ శక్తులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. అలాగే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా లోపాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆనాడు ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

ఈ కమిటీలో సభ్యులు..

మిక్కిలినేని మనుచౌదరి, ఐఏఎస్ – కలెక్టర్, మేడ్చల్-మల్కాజిగిరి

ప్రతీక్ జైన్ (ప్రతీక్ జైన్), ఐఏఎస్ – కలెక్టర్, సంగారెడ్డి

అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ – సంయుక్త కార్యదర్శి, ఐటీ & కమ్యూనికేషన్స్ శాఖ

హర్షవర్ధన్, ఐపీఎస్ – తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

అపూర్వ్ చౌహాన్, ఐఏఎస్ – ప్రాజెక్టు డైరెక్టర్, సీఎంఆర్ఓ

మంద మకరంద్, ఐఏఎస్ – ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్, ఏ. సంపత్ – డీఎస్పీ, తెలంగాణ సీఐబీ, సైబర్ క్రైమ్స్

ఎం. సుభాషిణి – డీఐజీ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ

ఏ. శ్రీనివాస సుబ్బారావు – సీనియర్ డైరెక్టర్ (ఐటీ) ఎన్‌ఐసీ

మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు ఎన్ఐసి పూర్తిగా కొత్తగా, అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లోకేష్ కుమార్ పేర్కొన్నారు. భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేశారు.

Next Story