చట్టవిరుద్ధంగా సోమేశ్‌కు సీఎస్ బాధ్యతలు అప్పగించారు : రాజాసింగ్

by Disha Web Desk |
చట్టవిరుద్ధంగా సోమేశ్‌కు సీఎస్ బాధ్యతలు అప్పగించారు : రాజాసింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కు ఒక చెంప దెబ్బ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014 విభజన తర్వాత డీఓపీటీ ఆంధ్రాకు కేటాయించిన సోమేశ్ కుమార్‌ను ఇక్కడ ఉంచడమే కాకుండా ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగిస్తారా? అని మండిపడ్డారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనైతికంగా, చట్టవిరుద్ధంగా సోమేశ్‌కుమార్‌కు సీఎస్ బాధ్యత అప్పగించారని అన్నారు. తమ అవినీతి కార్యక్రమాలన్నింటినీ సోమేశ్‌కుమార్ ద్వారా చేయించుకునేందుకే కేసీఆర్ ఆయనకు సీఎస్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌కు రాజ్యాంగం, చట్టం అంటే గౌరవం లేదని, రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నాడని విమర్శించారు. వెంటనే సోమేశ్‌కుమార్‌ను బాధ్యత నుంచి తప్పించి, ఆంధ్రాకు పంపాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్, సోమేశ్‌కుమార్ వంటి తన వ్యక్తులను, అధికారులను కీలక బాధ్యతల్లో నియమించి తెలంగాణలో ఒక అరాచక రాజ్యం నడిపిస్తున్నారని అన్నారు. ఎందరో సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కనబెట్టి సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వకుండా సోమేశ్ కుమార్ తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని అప్రజాస్వామిక పాలన చేస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని కేసీఆర్‌కు సూచిస్తున్నా అన్నారు. అర్హులైన అధికారులకు సముచిత గౌరవం కల్పించకపోతే ఇట్లాంటి మరెన్నో మొట్టికాయలు తినాల్సి వస్తుందని కేసీఆర్‌కు హెచ్చరిస్తున్నా అని రాజాసింగ్ అన్నారు.

Next Story

Most Viewed