రైతులకు స్మార్ట్ వ్యవసాయ సేవలు.. వాట్సాప్‌లో వాతావరణ అప్‌డేట్స్: మంత్రి తుమ్మల

by Ramesh Naini |

వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

రైతులకు స్మార్ట్ వ్యవసాయ సేవలు.. వాట్సాప్‌లో వాతావరణ అప్‌డేట్స్: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించనున్నట్లు తెలిపారు. శనివారం సచివాలయంలో డిల్​ ఇండియా, ఎవిడెన్స్​ యాక్షన్​ సంస్థలతో తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం కోసం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వివరిస్తూ మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సూచనలను రైతులకు వాట్సాప్ ​ద్వారా చేరవేయనున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వాతావరణ అంచనాలను వినియోగించడం ద్వారా రైతులు సరైన సమయంలో సాగు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని, దీంతో పంట నష్టాలను తగ్గించి ఉత్పాదకతను పెంచుకోవచ్చని పేర్కొన్నారు. రైతుల ఆదాయ వృద్ధి, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాబోయే రుతుపవనాలు, వర్షపాతం పరిస్ధితులకు సంబంధించి తొలి వాతావరణ సూచన సందేశాన్ని వాట్సాప్ ​ద్వారా రైతులకు పంపించారు. రైతులు నేరుగా వాతావరణ పరిస్ధితులు, వ్యవసాయ సూచనలకు సంబంధించిన ప్రశ్నలకు వాయిస్ ​రూపంలో అడిగిన సమాధానాలు పొందే విధంగా ఈ వేదికను మరింత అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు.

లక్షలాది మంది రైతులకు ప్రయోజనం

ఈ సేవలను మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తరించే విధంగా అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టాలని సంస్ధల ప్రతినిధులను మంత్రి కోరారు. వారు ఢిల్లీ నుంచి జూమ్ ​ద్వారా పాల్గొన్ని తమ సంస్థ రైతుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది తెలంగాణ రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ ​మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రైజింగ్​ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా కృత్రిమ మేధస్సును వినియోగించి రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవలు మరింత సమర్ధవంతంగా రైతులకు సమయానుకూల సమాచారం అందించే సామర్థ్యం ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్ధకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతు భరోసా పథకంలో ఫోన్ ​నెంబర్​ నమోదైన 17 జిల్లాలోని 304 మండలాలకు చెందిన 15 లక్షల మంది రైతులకు వాట్సాప్ ​ద్వారా సమాచారం అందిస్తామని చెప్పారు.

Next Story