బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ ఝలక్.. కేసీఆర్ ఎంట్రీ వేళ సంచలనం!

by prasad |
బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ ఝలక్.. కేసీఆర్ ఎంట్రీ వేళ సంచలనం!
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో/మహబూబ్ నగర్ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో వీరు తమ అనుచరులతో కలిసి పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం తొలిసారి ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లబోతుండగా ఇదే రోజు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు బీఆర్ఎస్ గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది.

కాంగ్రెస్ కు టచ్ లో మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు?:

పార్లమెంట్ ఎన్నికలకు శంకం పూరించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్న తరుణంలో పార్టీకి నేతల రాజీనామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం ఓ సిట్టింగ్ ఎంపీ, మరో కీలక నేత పార్టీని వీడగా తర్వాత ఎవరూ అనేది బీఆర్ఎస్ లో చర్చనీయాశంగా మారింది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బీఆర్ఎస్ కు చెందిన మరో ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రుపుతు పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదును చూసి త్వరలోనే వీరు కూడా పార్టీ మారబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.

చేరికలపై సైలెంట్ వ్యూహం:

పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డితో వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరుష పదజాలంతో రేవంత్ రెడ్డిని దూషించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే చెన్నూరు నియోజకవర్గం పరిధి భాగంగా ఉన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్ గు బై బై చెప్పారు. మరోవైపు చేరికల విషయంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అనుసరించిన స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ పార్టీ మారుతారనే ప్రచారం ముందు నుంచి జరుగుతున్నా ఇవాళే ఉంటుందనే విషయంలో కాంగ్రెస్ గోప్యత పాటించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఇదే వ్యూహాన్ని అమలు చేసి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు బుజ్జగింపులకు ఆస్కారం లేకుండా ప్లాన్ చేసింది. తాజాగా మరోసారి ఇదే వ్యూహం అనుసరిస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇంకెంత మంది కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారు? తర్వాత పార్టీ జంప్ చేసేది ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story

Most Viewed