స్పీడ్ పెంచిన సిట్.. కీలక నిందితుడు రమేష్ కస్టడీ కోసం పిటిషన్!

by Disha Web Desk 19 |
స్పీడ్ పెంచిన సిట్.. కీలక నిందితుడు రమేష్ కస్టడీ కోసం పిటిషన్!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాప్రతాల లీకేజీ కేసులో అరెస్టయిన రమేశ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్​అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్​దాఖలు చేశారు. ఆశించినంత వేగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో విచారణ జరగటం లేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిట్​అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవికిశోర్​నుంచి ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కొని.. అభ్యర్థులకు అమ్మిన వరంగల్​జిల్లా విద్యుత్​శాఖ డీఈ రమేశ్‌ను ఇటీవల అరెస్టు చేశారు.

విచారణలో హైదరాబాద్​అశోక్​నగర్‌లోని ఓ కోచింగ్​సెంటర్‌లో ఫ్యాకల్టీగా పని చేస్తున్న రమేశ్​పరీక్షలు జరగటానికి ముందే పదకొండు మంది అభ్యర్థులతో ఇరవై లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని ప్రశ్నాపత్రాలను వారికి అందచేసినట్టు వెల్లడైంది. దాంతోపాటు మరో 30మందితో బేరం కుదుర్చుకుని హైటెక్​పద్దతిలో వారితో మాస్​కాపీయింగ్​జరిపించినట్టుగా తేలింది. ఈ క్రమంలో రమేశ్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అతన్ని కస్టడీకి అనుమతించాలని సిట్​అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్​దాఖలు చేశారు. దీనిపై శనివారం కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.

కలిపి విచారించాలని..

సిట్​వర్గాలతో మాట్లాడగా.. రవికిశోర్, రమేశ్‌లను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే రవికిశోర్‌ను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇద్దరిని కలిపి విచారిస్తే ప్రశ్నాపత్రాలు ఎంతమంది చేతుల్లోకి వెళ్లాయి..? ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు..? అన్న వివరాలు వెలుగు చూస్తాయని చెప్పారు.


Next Story

Most Viewed