తెలంగాణలో SIR ప్రక్రియ షురూ.. అక్టోబర్ 1న తెలంగాణ తుది ఓటరు జాబితా!

by Kema Shiva Kumar |

తెలంగాణలో నేటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణలో SIR ప్రక్రియ షురూ.. అక్టోబర్ 1న తెలంగాణ తుది ఓటరు జాబితా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు రంగం సిద్ధమైంది. డబుల్ ఓటర్లను తొలగించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.38కోట్ల మంది ఓటర్లు ఉండగా, తుది ఓటర్ల జాబితాలో ఎంత మంది ఓటర్లు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్యుమరేషన్​ఫారాలను ముద్రించి ఇప్పటికే జిల్లాలకు పంపించారు. సర్​పై ఇప్పటికే రాజకీయ పార్టీలు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాయి. బిహార్, పశ్చిమబెంగాల్లో ఎదురైన అనుభవాలతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తిరుగుతూ బీఎల్వోలు ఎన్యుమరేషన్​ఫారాలు అందిస్తారు.

ఇవి గుర్తుంచుకోండి..

కొందరు ఓటర్లు ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటారు. ఇలాంటప్పుడు వారి కుటుంబసభ్యులు సైతం ఆ ఎన్యుమరేషన్​ ఫారాలను పూర్తిచేసి ఇవ్వచ్చు. రాష్ట్రం నుంచి ఎక్కువగా గల్ఫ్​దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. అదే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్, హైదరాబాద్​నగరాలకు వలసలు వెళ్లారు. ఎన్యుమరేషన్​ఫామ్స్ తీసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదని పేర్కొంటున్నారు. కేవలం ఎన్యుమరేషన్ ఫారం తిరిగి ఇస్తే సరిపోతుందని అంటున్నారు. అదే సమయంలో ఎన్యుమరేషన్​ఫామ్స్ రెండు ఇస్తారని, ఒక దానిని బీఎల్​వో సంతకం తీసుకుని వద్ద పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పేర్లలో పొరపాట్లు, తప్పులు, నాటి పేరు నేటి పేరుకు సరిపోలకపోవడం తదితర వాటిని జులై 31 నుంచి ప్రారంభమయ్యే నోటీసులో చేపడతారు. నాటి పేరుకు ఇప్పటి పేరుకు ఎందుకు తేడా ఉంది, వయస్సులో తేడాలు వంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తే సరిపోతుంది. ఇలాంటి వాటి కారణాలతో ఓట్లను తొలగించబోమని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కరికి ఒకే ఓటు..

ప్రస్తుత సాఫ్ట్​వేర్​ప్రకారం ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే గుర్తించే వ్యవస్థ లేదని చెబుతున్నారు. ఒకే రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఉంటే వారిని గుర్తిస్తుందని, ఇలా ఇప్పటి వరకు ఐదు లక్షల మంది వరకు గుర్తించినట్టు వారి నుంచి ఆప్షన్​తీసుకుని ఎక్కడ ఓటు ఉంచుకుంటారో తెలుసుకుని ఒక ఓటును మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించారు. దీంతో హైదరాబాద్​లో ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారిలో అత్యధికులకు అక్కడ, ఇక్కడ ఓటు హక్కు ఉంది. దీంతో వారిని రెండుచోట్లా ఉన్నట్టు గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో వారు రెండు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తప్పుడు సమాచారమిస్తే కేసులు

‘సర్’​ప్రక్రియలో తప్పుడు సమాచారం ఇచ్చే ఓటర్లపై కేసులు పెట్టేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. ఒకేవ్యక్తి రెండు చోట్ల ఎస్ఐఆర్​ఎన్యుమరేషన్​ఫారాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకోనున్నారు. పశ్చిమబెంగాల్​రాష్ట్రంలో 375 మంది ఒకే వ్యక్తిని మ్యాపింగ్​చేశారని, మరో రాష్ట్రంలో 250 మంది మ్యాపింగ్​చేశారని, ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చే వారిని అడ్డకట్ట వేయాలంటే కొందరిపై కేసులు పెడితే మిగిలిన వారిలో కొంత భయం వస్తుందని భావిస్తున్నారు.

కొత్త ఓట్లకు అవకాశం

ప్రస్తుతం జరిగే ‘సర్’​ ప్రక్రియలో కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీరు బీఎల్​వో ఇంటికి వచ్చినప్పుడు దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి దానికి అవసరమైన డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. వారి పేర్లను తుది ఓటరు జాబితాలో చేర్చుతారు. ఇతర ప్రాంతాల్లోఉండే వారికి ఆన్​లైన్​లో www.eci.gov.in లో ఎన్​రోల్​మెంట్​ఫారాన్ని పూర్తిచేసే సదుపాయం కల్పించారు. అయితే ఆధార్​ఓటీపీ ఆధారంగా పూర్తిచేయొచ్చు. ఓటరు జాబితాలో పేరు, ఆధార్​పేరుకు తేడా ఉంటే సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.

ఎస్ఐఆర్ షెడ్యూల్ ఇలా..

ఇంటింటికి ఎన్యుమరేషన్​ ఫామ్స్ పంపిణీ : జూన్​25 నుంచి జులై 24

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన : జూలై 31

అభ్యంతరాల స్వీకరణ : జులై 31 నుంచి ఆగస్టు 30

నోటీసులు ఇచ్చే టైం : జులై 31 నుంచి సెప్టెంబర్​28

తుది ఓటరు జాబితా ప్రచురణ : అక్టోబర్ 1

Next Story