అభివృద్దిలో ప్రభుత్వ రంగ సంస్థల గణనీయ అభివృద్ధి : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకొస్తున్న సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వృద్ధిలో పరుగులు పెడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

అభివృద్దిలో ప్రభుత్వ రంగ సంస్థల గణనీయ అభివృద్ధి :  కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకొస్తున్న సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వృద్ధిలో పరుగులు పెడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం ప్రభుత్వాలకు ఆర్థిక భారం అన్న పరిస్థితి నుంచి నేడు లాభాల బాట పట్టిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారుతున్నాయని వీటి పనితీరు, కనబరుస్తున్న సామర్థ్యం కారణంగానే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద సమర్పణ సందర్భంలో మోడీ గత పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల పని తీరు బాగా మెరుగుపడింది. ప్రజలకు కూడా పీఎస్​యులపై విశ్వాసం పెరిగిందని పేర్కొనట్లు తెలిపారు.

గత పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల నికర విలువ రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారన్నారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్1981లో ప్రారంభమైనప్పటి ఏనాడూ అందుకోని రికార్డులను 2024-25లో తొలిసారిగా అందుకుంది. చక్కటి పనితీరుతో ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటోందన్నారు. దాని బాటలోనే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వృద్ధి నమోదు చేసింది. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మైనింగ్ రంగంతో పాటు ఖనిజ రంగంలో పురోగతికి ఉదాహరణలుగా నిలిచాయని గుర్తు చేశారు.

భారత ప్రభుత్వ రంగ సంస్థలు సాధిస్తున్న విజయాలు మన సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తీరుకు నిదర్శనమన్నారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆవిష్కరణలు, జవాబుదారీతనం పెంపొందించడం, సంస్కరణలు తీసుకురావడం, పాలసీల్లో మార్పులు తీసుకురావడంతోనే ఈ సానుకూల మార్పు సాధ్యమైందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు కీలకపాత్ర పోషించనున్న సందర్భంలో ఈ విజయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇస్తున్నాయని వెల్లడించారు.

Next Story