లంచం తీసుకున్న ఎస్​ఐకి జైలుశిక్ష

by Dishanational2 |
లంచం తీసుకున్న ఎస్​ఐకి జైలుశిక్ష
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : అధికారికంగా సహాయపడేందుకు లంచం తీసుకున్న సబ్​ఇన్స్​పెక్టర్​కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఏసీబీ కేసుల కోర్టు ప్రిన్సిపల్​స్పెషల్​జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు.వివరాలు ఇలా ఉన్నాయి. 2013వ సంవత్సరంలో ఆవుల ప్రసాద్​హైదరాబాద్​ఆబిడ్స్​పోలీస్​స్టేషన్​లో సబ్ ఇన్స్​పెక్టర్​గా పనిచేశారు. ఆ సమయంలో కే.మాధవరెడ్డి అనే వ్యక్తిపై పోలీస్​స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​506, 509 సెక్షన్ల ప్రకారం కేసులు (క్రైం నెంబర్​121/2013) నమోదయ్యాయి.

అయితే, ఈ సెక్షన్లకు అదనంగా ఐపీసీ 354 సెక్షన్​ను చేర్చకుండా ఉండాలంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని సబ్​ఇన్స్​పెక్టర్​ప్రసాద్​డిమాండ్​చేశాడు. దాంతో మాధవరెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా సబ్​ఇన్స్​పెక్టర్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సబ్​ఇన్స్​పెక్టర్​ప్రసాద్​కు అవినీతి నిరోధక చట్టం సెక్షన్​7 ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, అయిదువేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలలపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక, సెక్షన్​13(1)(డీ) రెడ్​విత్​13(2) ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, అయిదువేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే మూడు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని పేర్కొంది.



Next Story

Most Viewed