'బీజేపీ సీట్ల కోసం హిందూ ముస్లింలు కత్తులతో పొడుచుకు చావాలా?'.. పటాన్ చెర్ లో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

by prasad |
బీజేపీ సీట్ల కోసం హిందూ ముస్లింలు కత్తులతో పొడుచుకు చావాలా?.. పటాన్ చెర్ లో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మతాలు, భాషలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనుషులు కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని, బీజేపీకి పిచ్చిపట్టుకుందని హిందూ ముస్లింలు పొడుచుకుని రక్తం పారుతుంటే అందులో నుంచి ఆ పార్టీ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికను ఎన్నికలు జరిగేవని కానీ తొలిసారి ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చుతాం, రిజర్వేషన్లు తొలగిస్తామనే ప్రాతిపదికను జరుగుతున్నాయన్నాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరులో నిర్వహించిన కార్నర్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పటాన్ చెరు మినీ ఇండియా లాంటిదని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసిస్తున్నారు. 25 ఏళ్లుగా మెదక్ స్థానాంలో బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎంపీలే ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు సక్రమంగా లేవని ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా, మాదిగల వర్గీకరణ కేసు గెలవాలన్నా, ముదిరాజులను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి మారాలన్నా ఇక్కడ నీలం మధు గెలిపించాలని కోరారు.

కొట్టుకు చస్తే ప్రాజెక్టులు వస్తాయా?:

శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడలు వస్తాయి. యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుంది. అలాకాకుండా రోజూ కొట్లాడుకుని చస్తుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి నిన్నా మొన్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చారు. కేంద్రంలో పెద్దలుగా ఉన్న వారు రాష్ట్రానికి వస్తే ఏదైనా తెస్తారేమో అనుకున్నాం. ఈ ప్రాంతానికి మెట్రో రైలుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు అనుకున్నాం. కానీ ఎలాంటి ప్రాజెక్టులు, సంస్థలు, తేకపోగా ఇక్కడి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు.

నేను రబ్బరు స్టాంప్ ను మాత్రమే:

ప్రస్తుతం తెలంగాణలో పేదల ప్రభుత్వం నడుస్తోంది. నేను కేవలం రబ్బరు స్టాంపును మాత్రమే. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా జగ్గారెడ్డిదే పెత్తనం. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ఎన్నో సంస్థలను తీసుకువచ్చింది. అందుకే కాంగ్రెస్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. నీలం మధు, కాటాశ్రీనివాస్ గౌడ్ రామలక్ష్మణుల్లా కలిసి పని చేస్తే మీ రాజకీయ భవిష్యత్ ను మేము చూసుకుంటానని హామీ ఇచ్చారు.

పటాన్ చెరు డెవలప్మెంట్ కోసం నన్ను గెలిపించండి: నీలం మధు

రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని, ఈ తాను స్థానికంగా పుట్టి పెరిగిన వ్యక్తిని. తన తల్లిదండ్రులు లేకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు అని తనను ఆదరించి గెలిపించాలని మెదక్ కాంగ్రెస్ నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమానత్వం కోసం పని చేసే పార్టీ అయితే బీజేపీ మతం పేరుతో, బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం పేరుతో ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేసిన నీలం మధు.. ఇక్కడ తనను ఎంపీగా గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రం నుంచి కేంద్రంలోని ఇండియా తరపు కేంద్రం నిధులతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

Next Story

Most Viewed