పాలిటెక్నిక్ ఫీజుల పెంపుపై ఎస్ఎఫ్‌ఐ ఆగ్రహం

by Ajay Maddhiboyina |

పాలిటెక్నిక్ విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఫీజుల భారం మోపడంపై స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాలిటెక్నిక్ ఫీజుల పెంపుపై ఎస్ఎఫ్‌ఐ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలిటెక్నిక్ విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఫీజుల భారం మోపడంపై స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులను తక్షణమే తగ్గించాలని, పేద విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వం ఫీజులను ఒక్కసారిగా 14,900 రూపాయల నుండి 39,100 రూపాయలకు పెంచి, విద్యార్థులపై 161 శాతం భారం మోపడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఫీజులు ఖరారు కానందువల్లే కౌన్సిలింగ్ వాయిదా వేశామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఫీజులను పెంచి సీట్ల అలాట్‌మెంట్ చేయడం సిగ్గుచేటని ఎస్ఎఫ్‌ఐ మండిపడింది. 2025 పాలిసెట్ పరీక్ష 80,949 మంది విద్యార్థులు రాస్తే, 28,996 మందికి మాత్రమే ప్రభుత్వం సీట్లను అలాట్‌మెంట్ చేసిందని, ఇందులో 1000 లోపు ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెంట్ చెల్లించి, మిగతా విద్యార్థులు 24,100 రూపాయలు వారే చెల్లించాలని నిర్ణయించడం పేద విద్యార్థులను వృత్తి విద్యకు దూరం చేయడమేనని ఎస్ఎఫ్‌ఐ ఆరోపించింది.

పేదల విద్యకు దూరం

ట్రిపుల్ ఐటీలో సీట్లు రాని, త్వరగా స్థిరపడి కుటుంబానికి అండగా నిలబడాలనుకునే పేద విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరతారని, అలాంటి వారిపై ఒక్కేసారి ఇంత మొత్తంలో ఫీజులు పెంచితే చదువులు ఎలా కొనసాగిస్తారని ఎస్ఎఫ్‌ఐ ప్రశ్నించింది. ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు 70 కోట్ల రూపాయలు భరించగలిగితే విద్యార్థులందరూ చదువుకునే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వం విద్యార్థులపైనే భారం మోపడం తగదని ఎస్ఎఫ్‌ఐ అభిప్రాయపడింది.. రాష్ట్రంలో సాంకేతిక విద్య పేదలకు అందుబాటులో లేకుండా చేసే కుట్రలను తిప్పికొట్టాలని ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులకు పిలుపునిచ్చింది.తక్షణమే ఫీజులను తగ్గించాలని, విద్యార్థులందరి ఫీజును ప్రభుత్వమే భరించాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

Next Story