తెలంగాణలో భానుడి ప్రతాపం.. 15 జిల్లాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-23 14:28:09  IST  )

రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

తెలంగాణలో భానుడి ప్రతాపం.. 15 జిల్లాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు వేడిగాలులు వీస్తోంటే.. మరోవైపు ఉక్కపోత ఊపిరి సలపనివ్వడంలేదు. శనివారం రాష్ట్రంలో 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటాయి. కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఇక కుమురంభీం ఆసిఫాబాద్ లో 46.2, సూర్యాపేటలో 46.2, ఖమ్మంలో 46.1, మంచిర్యాలలో 46.1, ములుగు 46, పెద్దపల్లి 45.9, భూపాలపల్లి 45.7, నల్గొండ 45.7, నిర్మల్ 45.5, నిజామాబాద్ 45.5, కరీంనగర్ 45.3, మహబూబాబాద్ 45.3, వరంగల్ 45.2, సిద్ధిపేట 45.1, హనుమకొండ 44.6, ఆదిలాబాద్ 44.5, రాజన్న సిరిసిల్ల 44.5, జనగామ 44, కామారెడ్డి 43.5, భువనగిరి 43.1, మెదక్ 42.4, హైదరాబాద్ 42.1, మేడ్చల్ మల్కాజిగిరి 42, రంగారెడ్డి 41.9, సంగారెడ్డి 41.8, నాగర్ కర్నూల్ 41.7, మహబూబ్ నగర్ 41.6, వనపర్తి 41.5, వికారాబాద్ 41.2, గద్వాల 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాబోయే వారంరోజుల్లో నార్త్, ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అక్కడక్కడా చిరుజల్లులు ఉపశమనాన్నిస్తాయని పేర్కొంది. హైదరాబాద్ లో మరికొద్దిరోజులపాటు 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని, మే24, 25 తేదీల్లో మోస్తరు వర్షం కాస్త రిలీఫ్ ఇస్తుందని వెల్లడించింది.

రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అధిక ప్రభావం ఉంటుందని పేర్కొంది. కొన్ని రోజుల పాటు వడగాలుల ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుండటంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వ్రుద్దులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే పగటి సమయాల్లో బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈ జిల్లాల్లో వర్షాలు

మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, అచ్చంపేట్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని, ఈ సమయంలో 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆ సమయంలో చెట్లు, హోర్డింగుల వద్ద ఎవరూ ఉండవద్దని కోరింది.

Next Story