తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

by Disha Web Desk 2 |
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తొమ్మిది మందికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వారు పనిచేస్తున్న బాధ్యతలు యధావిధిగా ఉంటాయని, కానీ వారి హోదాలు మాత్రం కొత్త పదోన్నతుల ప్రకారం ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం తెలంగాణ హోంగార్డ్ విభాగం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర అదే హోదాలో ఉంటారని, కానీ ఆయన పదోన్నతి మాత్రం పే మాట్రిక్స్ 15 కేటగిరీలోకి వెళ్తుందని పేర్కొన్నారు.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీకేయ (2006 బ్యాచ్)తో పాటు మరో ఐదుగురు స్టేట్ సర్వీస్ నుంచి ఐపీఎస్‌లుగా గుర్తింపు పొందిన రమేశ్ నాయుడు, ఏవీ రంగనాధ్, వీ.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు ఐజీలుగా పదోన్నతి పొందినట్లు సీఎస్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇద్దరు డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్ ఆఫీసర్లు నేలకొండ ప్రకాశ్‌రెడ్డి, డి.జోయల్ డేవిస్ (ఇద్దరూ 2010 బ్యాచ్) డీఐజీలుగా పదోన్నతి పొందినట్లు సీఎస్ తెలిపారు.


Next Story