48 గంటల్లో తెలంగాణలో ఏడుగురు గురుకుల విద్యార్థులు మృతి

by Naga Rani Yarlagadda |

గడిచిన 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు గురుకుల విద్యార్థినీ, విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది.

48 గంటల్లో తెలంగాణలో ఏడుగురు గురుకుల విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు గురుకుల విద్యార్థినీ, విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. సూర్యాపేట - నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోగా.. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్‌లో ఇంటర్ చదవడం ఇష్టంలేక పురుగుల మందు తాగి హరికృష్ణ అనే బలవన్మరణం చెందాడు.

స్టేషన్‌ఘన్‌పూర్ మహాత్మాజ్యోతి బాపూలే రెసిడెన్షియల్‌ స్కూల్లో వాకింగ్ చేస్తూ మణితేజ అనే విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలం యబాజీగూడకు చెందిన కేజీబీవీ విద్యార్థిని యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పాలమాకుల కేజీబీవీలో పదో తరగతి చదువుతోన్న నవీంద్ర (16) ఆత్మహత్యకు పాల్పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో గురుకులంలో ఉండడం ఇష్టం లేక.. వసతి గృహంపై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించి సంధ్య అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ఆశ్రమ పాఠశాలలో నాలుగు రోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతూ భాను ప్రకాష్(13) అనే విద్యార్థి మృతి చెందాడు. ఆసిఫాబాద్ లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయి ఇంటికి వచ్చి సుర్పం శేఖర్ (17) తిరిగి కాలేజీకి వెళ్లేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రులు మందలించడంతో గ్రామంలోని చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. ఇలా 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు గురుకులాల విద్యార్థులు బలవన్మరణాలు చెందడం కలకలం రేపుతోంది.

Next Story