రేషన్ పంపిణీలో ‘సర్వర్’ పరేషాన్: గంటల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులు

by Kema Shiva Kumar |

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మూడు నెలల కోటా కోసం మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి.

రేషన్ పంపిణీలో ‘సర్వర్’ పరేషాన్: గంటల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. అయితే, సాంకేతిక సమస్యలు తోడవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

బయోమెట్రిక్‌తో చిక్కులు..

ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ నిబంధనల ప్రకారం.. మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ-పాస్ (e-POS) యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర (Biometric) వేయాల్సి వస్తోంది. ప్రతి నెలకు విడివిడిగా అథెంటికేషన్ చేయాల్సి రావడంతో ఒక్కో కార్డుకు 20 నుండి 30 నిమిషాల సమయం పడుతోంది. ఒకేసారి లక్షలాది మంది బయోమెట్రిక్ వేస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి ప్రక్రియ నెమ్మదించింది. దీంతో వేలిముద్రలు పడక ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.

మండుతున్న ఎండలతో అవస్థలు

ఓ వైపు ఎండలు మండుతుండటంతో వృద్ధులు, మహిళలు షాపుల వద్ద తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రద్దీని తగ్గించేందుకు కొన్ని చోట్ల డీలర్లు టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పటికీ, అది మరింత గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు, గోదాముల నుంచి వస్తున్న బియ్యం బస్తాల్లో తూకం తక్కువగా ఉంటోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కేజీల బస్తాలో 4 కేజీల వరకు తక్కువగా వస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల వల్ల పంపిణీ ఆలస్యమవుతున్నందున, ఈ నెల రేషన్ పంపిణీ గడువును ఏప్రిల్ 30 తర్వాత కూడా పొడిగించాలని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే, మూడు సార్లు థంబ్ వేసే పద్ధతిని మార్చి, ఒకే వేలిముద్రతో 3 నెలల బియ్యం ఇచ్చేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలని కోరుతున్నారు.

Next Story