- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో 448 అద్దె బస్సుల కొనుగోలుకు సెర్ప్ సిద్ధం
సెర్ప్ (SERP) సీఈఓ దివ్యా దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ నాగిరెడ్డికి కీలక లేఖ రాశారు.

దిశ, వెబ్ డెస్క్: సెర్ప్ (SERP) సీఈఓ దివ్యా దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ నాగిరెడ్డికి కీలక లేఖ రాశారు. మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేందుకు వీలుగా మరో 448 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరైన వెంటనే, ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ఆమె వెల్లడించారు. మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.
కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే, ఆర్టీసీలో మహిళా సమాఖ్యల ద్వారా నడిచే బస్సుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్యల ద్వారా 152 ఆర్టీసీ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. సెర్ప్ ద్వారా అదనంగా 448 బస్సులు చేరితే, మహిళా సమాఖ్యలు నిర్వహించే మొత్తం బస్సుల సంఖ్య 600కు చేరుకుంటుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మహిళా సంఘాలకు పెద్ద ఊరటగా మారనున్నాయి. ఆర్టీసీ ద్వారా ఉపాధి పొందే మహిళల సంఖ్య, రాష్ట్రంలో మహిళా శక్తి ద్వారా మౌలిక సదుపాయాల నిర్వహణ విస్తృతి ఈ నిర్ణయం ద్వారా మరింత పెరగనుంది.






