బ్రేకింగ్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ఇవాళ ప్రకటించారు. ఖమ్మంలో కార్యకర్తలతో తుమ్మల ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతానని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారనన్నారు.

కానీ, తాను ఎవరినీ నిందించదల్చుకోలేదన్నారు. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉందని.. ఖమ్మం జిల్లా అభివృద్ధికి నా జీవితం అంకితం చేశానని చెప్పారు. ఎందరో నాయకుల వల్లకానివి.. నేను చేసి చూపించానన్నారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. మీతో శభాష్ అనిపించుకుంటా కానీ.. ఎక్కడ తలవంచే ప్రసక్తే లేదన్నారు. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా వల్ల ఎవరూ తల దించుకోవద్దన్నారు. తనకు పదవి అలంకారం, అహంకారం, అధిప్యతం కోసం కాదన్నారు. మీ కోసమే రాజకీయ జీవితం తప్పా.. తనకు పాలిటిక్స్ అవసరం లేదన్నారు.

కాగా, మాజీమంత్రి, బీఆర్ఎస్‌లో కీలక నేత అయిన తుమ్మలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంతో పాలేరులో ఆయన అనుచరులు భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మలను పాలేరు బరిలో ఉండాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుండి తుమ్మల బరిలోకి దిగుదామనుకోగా.. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ కేటాయించారు.

ఇటీవల 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్.. పాలేరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళకే మళ్లీ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను కూడా బరిలో ఉంటానని తాజాగా తుమ్మల ప్రకటించడంతో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, 2018లో పాలేరు నుండి బరిలోకి దిగిన తుమ్మల సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాళ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం కందాళ ఉపేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే, ఈ సారి ఎక్కువగా సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించిన కేసీఆర్.. పాలేరు టికెట్‌ను మరోసారి కందాళకే కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను కూడా బరిలో ఉంటానని తాజాగా తుమ్మల ప్రకటించడంతో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ వేడెక్కాయి.

Next Story

Most Viewed