Obulapuram Mining Case: ఆ ఐదుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సంచలన తీర్పు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-06 10:51:17  IST  )

ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో సంచలనం చోటుచేసుకుంది.

Obulapuram Mining Case: ఆ ఐదుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో సంచలనం చోటుచేసుకుంది. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను మినహాయించి.. మిగిలిన ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా తేల్చింది. వీరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

A1గా బీవీ శ్రీనివాస్ రెడ్డి

A2గా గాలి జనార్ధన్ రెడ్డి

A3గా వీడి రాజగోపాల్

A4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ

A7గా మెహాఫస్ అలీఖాన్‌

కాగా, ఆంధ్ర-కర్ణాటక (Andhra-Karnataka) సరిహద్దులోని అనంతపురం (Ananthapur), బళ్లారి (Bellary) రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాతో పాటు ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇనుప గనులను ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమంగా తవ్విందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఓబుళాపురంలో ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలను చేపట్టకూడదని జీవో నెం.71ను కూడా విడుదల చేశారు. ఈ మేరకు రంగంలోని సీబీఐ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు.

సీబీఐ ఆరోపణలు ఇలా..

ఓబుళాపురం (Obulapuram), మల్పనగుడి (Malpanagudi) గ్రామాల్లో (అనంతపురం జిల్లా) 68.5 హెక్టార్లు, 39.5 హెక్టార్లలో ఇనుప గనుల లీజులను ఓఎంసీకి అక్రమంగా కేటాయించారని తేల్చారు. అయితే, ఆ లీజులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajashekar Reddy) పాలనలో అనుకూలంగా జరిగాయని, 23 ఇతర దరఖాస్తుదారులను పక్కన పెట్టి అనూహ్యంగా ఓఎంసీకి మాత్రమే లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకన్నారని వెల్లడించారు. గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువగా తవ్వి, కర్ణాటకలోని అటవీ భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు జరిపారని, దీంతో ప్రభుత్వానికి రూ.884.13 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విచారణలో వెల్లడైంది. నకిలీ పత్రాలను సృష్టించి, బళ్లారి (కర్ణాటక) నుంచి తవ్విన ఇనుప ఖనిజాన్ని ఓబుళాపురం నుంచి వచ్చినట్లుగా చూపించారని ఆరోపించారు. ఐఏఎస్ యర్రా శ్రీలక్ష్మి (Sri Lakhsmi), అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా‌రెడ్డి (Sabitha Indra Reddy) అధికార దుర్వినియోగం చేసి, ఓఎంసీకి లీజులు మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి 2007లో ఓఎంసీ దరఖాస్తును సమర్థిస్తూ 10 మిలియన్ టన్నుల ఉక్కు ప్లాంట్ కోసం అని తెలిపారని పేర్కొన్నారని.. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని సీబీఐ గుర్తించింది.

2011లో ఫస్ట్ చార్జిషీట్..

ఓఎంసీ కంపెనీ రూ.884.13 కోట్ల అక్రమంగా మైనింగ్ చేశారని సీబీఐ అధికారులు 2011లో ఫస్ట్ చార్జిషీటు దాఖలు చేశారు. అందులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్‌ రెడ్డి (BV Srinivas Reddy)ని A1గా, గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)ని A2గా చేర్చారు. అదేవిధంగా ఆ సమయంలో మైనింగ్‌ డైరెక్టర్‌ వాల్మికి రాజగోపాల్‌, ఐపీఎస్ కృపానందం, గాలి జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌, అప్పటి గనులు శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)పై కూడా సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఇక తనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించగా ఆ కేసును ధర్మాసనం కొట్టివేసింది. కానీ, సీబీఐ వేసిన అప్పీలు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 219 మంది సాక్షులను విచారించగా.. మొత్తం 3,400 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ కోర్టు 14 ఏళ్ల తరువాత కేసులో తుది తీర్పును ఇవాళ వెలువరించింది.

Next Story