తెలంగాణ ప్రజలకు వజ్రాయుధం లాంటి పార్టీని అందిస్తా: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

తెలంగాణ ప్రజలకు వజ్రాయుధం లాంటి పార్టీని అందిస్తా: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. తుమ్మల నాగేశ్వర రావు లాంటి సీనియర్ నేతలను వదులుకోవడంతోనే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిందని అన్నారు. సీనియర్ నేతలను వదులుకొని కేసీఆర్ తప్పిదం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ గురించి ఇప్పుడే ఆలోచన లేదు.. ఇంకా చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పేరు ఎత్తితేనే ప్రజలు లకారాలతో తిడుతున్నారు.. అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా తెలిచిందో తెలియడం లేదని అన్నారు. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలతోనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంతో అధికార, ప్రతిపక్షాలు నిద్ర లేస్తున్నాయని అన్నారు. 20 ఏళ్లు పనిచేసిన నన్ను కుట్ర చేసి పార్టీకి, కుటుంబానికి దూరం చేశారు.. అలాంటి వారి గురించి కచ్చితంగా మాట్లాడుతాను.. అస్సలు వదిలే ప్రసక్తే లేదని అన్నారు. తాను చాలా ధైర్యవంతురాలిని.. ఆరు నెలలు జైల్లో పెట్టినా భయపడలేదు.. వేరే వాళ్లైతే డిప్రెషన్‌తో ఇంటికే పరిమితమయ్యే వాళ్లని వెల్లడించారు. తెలంగాణ ఆడబిడ్డలు రాజకీయాల్లోకి ధైర్యంగా రావాలనే వారి బరువును భుజానికి ఎత్తుకున్నానని చెప్పారు. నాపై ఇంకా నీచస్థాయిలో దాడి చేస్తారు.. అయినా సరే బెదిరేది లేదని అన్నారు. బీసీలకు పార్టీ పరంగా సీట్లు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మోసానికి దిగుతున్నారు.. ఆయన చర్య వందకు వెయ్యి శాతం బీసీలను మోసం చేయటమే.. బీసీ ద్రోహిగా మిగిలిపోవద్దు అని రేవంత్ రెడ్డికి సూచించారు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‌లో కొనసాగినన్ని రోజులు నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేశారు.. అందుకే ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతున్నాను.. జాగృతిని బలోపేతం చేస్తున్నాను. ఏదో పార్టీ పెట్టామా? నడిపించామా అన్నట్లుగా మాత్రం చేయను.. పార్టీ పెట్టేది ఉంటే మాత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఢంకా బజాయించి ప్రకటిస్తా.. తెలంగాణ ప్రజలకు వజ్రాయుధం లాంటి పార్టీని అందిస్తానని కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. కానీ.. ఇప్పుడే ఆ పని చేయను అని.. ముందు ముందు పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ప్రస్తుతం నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫ్రెంచ్ విప్లవం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ మలి ఉద్యమం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నానని చెప్పారు.

కాకర్లపాడు గ్రామంలో సామినేని రామారావుని దారుణంగా చంపేశారు. 20 రోజులైనా ఎఫ్ఐఆర్‌లో పేర్లు ఉన్న వారిని పోలీసులు విచారించలేదు. మధిరలో ఇది మూడో రాజకీయ హత్య. ఇలాంటి విషయాల్లో పోలీసులు మౌనం మంచిది కాదు. తెలంగాణలో హత్య రాజకీయాలను ఎంకేరజ్ చేయవద్దు. ఈ మూడు రాజకీయ హత్యలపై డీజీపీ దృష్టి పెట్టి విచారణ చేపట్టాలి. రేపు హైదరాబాద్‌లో డీజీపీని కలుస్తా. రామారావు కుటుంబ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

Next Story