గురుకుల పాఠశాలల పని వేళల్లో మార్పులు! ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సెక్రటరీ హామీ

by Ramesh Naini |   (  Updated:2026-02-19 15:26:16  IST  )

గురుకుల పాఠశాలల పనివేళలు ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా మారుస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారు.

గురుకుల పాఠశాలల పని వేళల్లో మార్పులు! ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సెక్రటరీ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల పనివేళలు ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా మారుస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారు. గురువారం సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీయస్‌యూటీఎఫ్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ విభాగం నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై టిఎస్ యుటిఎఫ్ ఇచ్చిన ప్రాతినిధ్యంపై స్పందిస్తూ ప్రమోషన్ ప్రక్రియ త్వరలో చేపడతామని, సమయం మార్పు చేయడంతో పాటు రాత్రి విధులు నిర్వహించిన వారికి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అనుమతించడానికి అంగీకరించారు. పార్ట్ టైం టీచర్ల వేతనాలు రెండు రోజుల్లో విడుదల చేస్తామని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 వేతనాల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుటకు, కేర్‌టేకర్‌గా అదనపు పోస్టులు మంజూరుకు, ప్రిన్సిపాల్ ప్రమోషన్‌లో సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ 100 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని తెలియజేశారు.

Next Story